Monday, January 12, 2009

మా వూళ్ళో సంక్రాంతి


నాకు చాలా ఇష్టమైన పండుగ సంక్రాంతి. మా వైపు పెద్ద పండుగ అంటారు (పెద్దల పండుగ, అన్నిటికన్నా పెద్ద పండుగ అని రెండు అర్థాలు ) . ఇప్పుడు పెద్ద హడావిడి కనిపించటం లేదు కానీ, మా చిన్నప్పుడు చాలా సంబరం గా జరిగేది పండుగ మూడు రోజులు. ధనుర్మాసం ప్రారంభం తోనే పండుగ హడావిడి మొదలవుతుంది వూరిలో. అంతా కొత్త బట్తలు కొనటం , కుట్టించుకోవటానికి టైలర్ దగ్గర క్యూలు. ఇంకా ధనుర్మాసం మొదటి రోజు నుండి ఇళ్ళముండు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, వాటి కి గుమ్మడి, తంగేడూ పూలతో అలంకరణలు వీటితోపాటే శితాకాలపు చలి , మంచు తో ఆ పల్లెటూరి అందాలు ద్విగుణీకృతం అవుతాయి. రోజూ స్కూల్ నుండి వచ్చేటప్పుడు దారిలో గుమ్మడి పూలు చాటుగా కోసుకు రావటం , ఎవరి ఇంటి ముందు ఎక్కువ గొబెమ్మలు , గుమ్మడి పూలు పెట్టరు అని పిల్లల మధ్య పందేలు ఇవన్నీ చాలా చాలా మంచి జ్ఞాపకాలు. ఇక భోగి ముందు రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే చెరుకు తోటల లో పడి ఎండు చెరుకు ఆకులను మోపులుగా కట్టి తెచ్చి ఇంట్లో పడేయటం ఇంట్లో భోగి మంటలో వేయటానికి పనికి వచ్చే పాత సామాను అంతా పోగేయటం ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని ఆత్రం గా ఎదురు చూడటం. ఉదయం మూడూ కి అంతా మా పెద నాన్న, తాత గారు నిద్ర లేపే వాళ్ళూ అందరినీ , మళ్ళీ ఎవరిది పెద్ద మంటా ఎవరిది చాలా సేపు కాలుతుంది అని మళ్ళి పందేలు. అప్పట్లో చలి కూడా బాగా ఉండేది సో భోగి మంట బాగా ఎంజాయ్ చెసే వాళ్లము. ఆ తరువాత చాకలి తో తలంటు, వాళ్ళ బలమంత చూపించి మర్దన చేసే వాడు. వొళ్ళంతా హూనమైయేది. ఇక ఆ నూనె జిడ్డూ మొత్తం పోవాలంటే గిన్నెడు కుంకుడు కాయరసం తో చేస్తే తప్ప వదిలేది కాదు. ఆ రోజంత ఇక పెద్దగా ఏమీ వుండేది కాదు ఏవో స్వీట్స్ వండటం తప్ప.రెండొ రోజు సంక్రాంతి, ఈ రోజు ఉదయం ఉపవాసం , మధ్యాహనం పూజ ఆ తరువాత చనిపోయిన పెద్దలకి బట్టలు పెట్తడం అయిన తరువాత భోజనాలు. సాయంత్రం పిల్లాంతా కలసి సరదాగా మామిడి తోటలోకో లేక చెరకు తోట కో వెళ్ళీ రేగు పళ్ళు కోసుకొని, కాలువలో నీళ్ళతో కాసేపు ఆడుకొని వచ్చే వాళ్ళము.
ఇక మూడో రోజు కనుమ, మా వైపు పశువుల పండుగ అని కూడా అంటారు. తెల్ల వారుఝామునే ఊరి మధ్యలో ఉన్న సత్యమ్మ దేవత దగ్గర పొంగళ్ళు పెట్టే వాళ్ళు. ఆ ప్రసాదం వూళ్ళొ అందరూ తప్పకుండ తినే వాళ్ళు. చాలా మంచి జరుగుతుంది అని నమ్మకం. ఆ తరువాత ఇంట్లో ఆవులను , ఎద్దులను బావి దగ్గరకు తీసుకు వెళ్ళి వాటిని కడిగి, కొమ్ములకు రంగులు వేసి, తరువాత వాటి కొమ్ములను పలకలు (అంటే చెక్కతో రకరకాల రూపాలలో చెక్కిన బొమ్మలు లాంటివి) , బెలూన్లు , రంగు కాగితాల తో అలకరించే వాళ్ళము. ఉదయం 10 కి అంతా ఊరిలో ఎడ్ల పందేలు ప్రారంభమైయేవి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఎడ్లను పట్టుకొని వాటితో పాటు పరిగెత్తే వారు. మధ్యలో ఎవరైనా పట్టుకొని ఎద్దుని లొంగదీసుకొని వాటికి ఉన్న పలకలు లాకొనే వాళ్ళు. అలా ఎవరు ఎక్కువ పలకలు లాకుంటే అంత గొప్ప అన్నమాట. మేమంతా వీది అరుగుల మీద , మెద్దెల మీద నిల్చొని ఈ పోటీలు చూసే వాళ్ళము. ఇవన్నీ అయిపోగానే కుదిరితే పక్క వూళ్ళో పోటీలు కూడా చూసి వచ్చే వాళ్ళము. ఈ పోటిలు చాలా సందడిగా ఉండేవి. ఈ పోటీలు అయిపోగానే పశువులన్నిటిని మేత కోసం ఫ్రీగా అడవులలోకి వదిలేసే వాళ్ళు. మా ఇంట్లో అయితే మా బంధువులంతా కలిసే వాళ్ళము ఈ రోజు. చిన్న పిల్లలందరితో కలిపి 35-40 మంది అయ్యే వాళ్లము ఇంట్లో. అసలు అంత మంది తో ఎంత సందడి సందడి గా ఉండేదో ఇల్లు. మళ్ళి సాయంత్రం ఊరి బయట కాటారజుల దేవుళ్ళు అని కొన్ని చిన్న విగ్రహలు ఉంటాయి అక్కడ పొంగళ్ళు పెడుతారు. దాదాపు ఊరిలో జనాలంతా అక్కడా చేరే వాళ్ళు. చుట్టు పక్కల ఉన్న బీడు భుములలో ఆటలు పాటలు జరిగేవి పొగళ్ళు జరుగుతున్నంత సేపు. ఇక చివరి ఘట్టం చిట్లా కుప్ప. పొంగళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టి ఓ వైపు ఎండు చెరుకు ఆకు తో పెద్ద మట వేసే వాళ్ళు. ఇక కుప్పకి ప్రతి సంవత్సరం ఎవరో ఒక పెళ్ళీడు కి వచ్చిన కుర్రాళు మంట పెట్టే వాళ్ళు. అది కూడా ఈ కుర్రాడు దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మంట పెడుతుంటే వేడి పొంగలి ముద్ద తో వాళ్ళ వెనుక కొట్టే వాళ్ళు. అలా చేస్తే త్వరలో ఆ కుర్రాడికి పెళ్ళి కుదురుతుందని నమ్మకం. ఇక ఆ చిట్లా కుప్ప మండుతుండగానే అడవులలోకి వదిలిన పశువులన్నిటిని తోలుకు వచ్చే వాళ్ళు. ఆ మంటతో ఆ పశువులకు దిష్టి తీసినట్టు ఉండె లా మంట పక్క నుండి వెళ్లనిచ్చే వాళ్ళు. అంతా అయిపోయినతరువాత ప్రసాదం తిని చీకటి పడుతుండగా ఇల్లు చేరే వాళ్ళము.
ఆ చివరి రోజు ఎంత సరదాగా గడచిపోయేదో. 2001 లో చివరిసారి మా వూళ్ళో సంక్రాంతి చూసా, ఆ తరువాత నుండి దాదాపు అన్ని సంక్రాంతులు మిస్ అవుతూనే ఉన్నా.. :(
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు :)

Wednesday, January 7, 2009

అ 'సత్యం' !!!


కోటి ఆశలతో కొత్త సంవత్సరం లో కి అడుగిడి వారం కూడా దాటక ముందే పెద్ద షాక్. మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతో గర్వం గా చెప్పుకొనే , దేశం లో అతి పెద్ద నాలుగో ఐ టి కంపెనిగా వెలుగొందుతున్న 'సత్యం' లోని నిజమైన సత్యాలు దేశ ఐటి రంగానికి పెద్ద షాక్. ఆర్థిక మాంద్యం పుణ్యమా ని ఇప్పటికే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేకుండా ఉంటే పులి మీద పుట్ర లా ఒక మహా పతనం సాఫ్ట్వేర్ ఉద్యోగులను మరింత భయాందోళనలలోకి నెట్టేసింది.

రాష్ట్రం లో ని ప్రతి పల్లె లోనూ సుపరిచితమైన పేరు సత్యం. వూళ్ళో నిరక్ష్యరాసులైన వాళ్ళకు కూడా కంప్యూటర్స్ అంటే 'సత్యం' గుర్తొచ్చేఅంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ పరిస్థితి నేదు అత్యంత దయనీయం. కొన్ని సంవత్సరాల ముందు మా వూళ్ళో నేను ఇంఫోసిస్ లో పని చేస్తున్నాను అంటే అదేంటి సత్యం లో రాలేదా అనే వాళ్ళు, ఈ సారైనా సత్యం లో చేరటానికి ట్రై చెయ్యి అనే వాళ్ళు, సిఎం తో మాట్లాడి సత్యం కి ట్రై చేద్దామా అనే వాళ్ళు చాలా మంది. అంతటి ప్రఖ్యాతులు గాంచిన కంపెని. నా కెరీర్ లో మొట్టమొదటి ఇంటర్వ్యూ కూడా సత్యం తోనే ఆ రోజు అందులో చివరి రౌండ్ లో పోవటంతో చాలా బాధ పడ్డా. ఇంత మంది కోరుకోవటం వల్లేమో గత సంవత్సరమన్నర నుండి 'సత్యం' కి పని చేస్తున్నా. గత మూడు నెలల నుండి ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు కానీ ఇలా జరుగుతుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు.

ఎందరికో రోల్ మోడల్ లా నిలచిన 'సత్యం' రాజు వెల్లడించిన నిజాలు తీవ్ర ఉత్కంఠకి గురి చేసాయి. రాబోయే రోజులలో ఏవిధం గా ఉంటుందో తెలియదు. క్లైంట్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడూ ఖచ్చితం గా కొత్త ప్రాజెక్ట్లు రావటం అనేది జరగదు. ఉన్నవి అన్నా నిలుస్తాయో లేదో తెలియని పరిస్థితి. అసలే ఆర్థిక మాంద్యం , ఎంత వెతికినా కనపడని కొత్త ప్రాజెక్ట్లు దాదాపు 47 వేల మంది ఉద్యోగులను అయోమయం లోకి నెట్టేశాయి. ఒక్క రోజులోనే 1000 కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము బూడిద పాలు, దేశం లోనే అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణం. ఇటువంటి కుంభకోణం లో ఒక్క రాజు తప్ప వేరెవరి పాత్రా లేదంటే నమ్మటం కష్టమే. ఆడిటర్లకి, డైరెక్టర్ల కి, బ్యాంకులకి తెలియకుండా జరగటం అసంభవం. ఈ అనుమానానికి ఊతమిచ్చే ఒక సంఘటన రెండు రోజుల ముందే జరిగింది. సత్యం కి external ఆడిటర్స్ అయిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మొన్న సత్యం ఆడిటింగ్స్ నుండి తప్పుకోవటం. వీళ్ళకి ఈ ఆడిటింగ్ అవకతవకలన్ని ముందే తెలిసి ఉండవచ్చేమో అందుకే తప్పుకున్నాయి అన్న అనుమానం రాక తప్పదు. ఇక బ్యాంకులలో డబ్బు లేకుండానే ఉన్నట్లు బ్యాంకులు ఎలా చెప్ప గలిగాయి ? ఇవన్ని చూస్తుంటే నిజంగానే ఇవన్నీ ఆడిటింగ్ ఫ్రాడ్స్ ఆ లేక 7000 వేల కోట్లు దారి మాళ్ళాయా అన్న అనుమానం రాక పోదు.

ఈ దెబ్బతో ఒక సత్యం ఏ కాకుండా మేటాస్ సంస్థలు కూడా సంక్షోబంలో కి కూరుకుపోయాయి. ఒక మహా సంస్థ కళ్లముందే కుప్ప కూలింది. కూలుతూ రాష్ట్ర , దేశ కార్పొరేట్ రంగానికి మాయని మచ్చని మిగిల్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐ టి కంపెని బ్యాలెన్స్ షీట్లను అనుమానంగా చూడాల్సిన పర్స్థితి. ఏదొ నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి. ఇటువంటి విషయాలను ఆదిలోనే అరికట్టాల్సిన సెబి ఇప్పుడే నిద్ర లేచినట్టు విచారణ అంటూ హడావిడి చేయటం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే.
47 వేలమంది ఉద్యోగులు, వేల కోట్ల రూపాయిలు మదుపు చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఎలా కాపాడబడుతాయో రానున్న రోజులలో కాలం నిర్ణయించాల్సిందే.